సుబేదారి, జూన్ 30 : న్యాయం చేయాలని ఠాణా మెట్లు ఎక్కిన బాధితులకే చుక్కలు చూపిస్తున్నాడో పోలీస్ అధికారి. ‘చెప్పినట్టు వింటారా? లేకపోతే పట్టుకొచ్చి లోపలేయాలా?’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితులు గజగజ వణికిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ నగరం సెంట్రల్ జోన్లో ఓ ఇన్స్పెక్టర్.. తన స్టేషన్ పరిధిలో స్వర్ణకారుడు ఆభరణాల తయారీ కోసం తన వినియోగదారుల నుంచి పెద్దమొత్తంలో బంగారం తీసుకున్నాడు.
హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన ఓ బాధితుడికి ఆ స్వర్ణకారుడు చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో కొద్దిరోజుల క్రితం రూ.7 లక్షలకుపైగా విలువ చేసే 85 గ్రాముల బిస్కెట్ గోల్డ్కాయిన్ ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఇటీవల ఆ స్వర్ణకారుడు బాధితుల నుంచి తీసుకున్న బంగారంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు అతడి షాపు వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీశారు.
కమలాపూర్కు చెందిన బాధితుడు కూడా వెళ్లి సిబ్బందిని నిలదీయగా పాత పరిచయంతో స్వర్ణకారుడి వద్ద పనిచేసే సిబ్బంది 50 గ్రాముల బంగారం అతడికి ఇచ్చారు. అదే సమయంలో మరికొందరు తమకు న్యాయం చేయాలని స్థానిక ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయడంతో స్వర్ణకారుడి అసలు బాగోతం బయటపడింది. పరారైన స్వర్ణకారుడి వద్ద పనిచేసే సిబ్బందిని విచారణ కోసం ఇన్స్పెక్టర్ స్టేషన్కు పిలిపించినట్టు తెలిసింది.
ఎంతమంది వద్ద ఎంతెంత బంగారం తీసుకున్నారు? ఎవరెవరికి ఇచ్చారు? అని వివరాలు తీసుకొన్నాడు. బంగారం తిరిగి తీసుకున్న బాధితులకు ఫోన్చేసి ‘మీరు తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వాలి’ అని ఫోన్ చేసి హుకూం జారీ చేసినట్టు తెలిసింది. కమలాపూర్కు చెందిన బాధితుడికి ఇన్స్పెక్టర్ ఫోన్చేసి తీసుకున్న 50 గ్రాముల బంగారం స్టేషన్కు తీసుకొచ్చి ఇవ్వాలని బెదిరించాడు.
‘నేను ఇచ్చిన 85 గ్రాముల బంగారంలో వచ్చింది 50 గ్రాములే. ఇంకా 35 గ్రాముల బంగారం రావాలి. రసీదు, ఫోన్ కాల్స్ రికార్డ్సు ఉన్నా యి’.. సార్ అని సదరు బాధితుడు మొరపెట్టుకున్నా ఆ ఇన్స్పెక్టర్ వినలేదని తెలిసింది. ‘స్టేషన్కు వస్తావా? రావా?.. రాకుంటే పట్టుకొచ్చి లోపలేస్తా’.. అని బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో బాధితుడు భయాందోళనకు గురవుతున్నట్టు తెలిసింది.