హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికారుల నుంచి ఆదేశాలు. పాతస్థానంలోనే కొనసాగాలని సూచనలు. దీంతో బదిలీ అయిన ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ఇలాంటి టీచర్లు రాష్ట్రంలో పదివేలకుపైగా ఉంటారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
వీరిలో అత్యధికులు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉంటారని తెలిపాయి. ప్రస్తుతానికి బదిలీ అయిన టీచర్లలో కొంత మందిని సెప్టెంబర్ దాకా రిలీవ్చేయబోమని విద్యాశాఖ అధికారులంటున్నారు. టీచర్లు లేనిచోట, ఒకే టీచర్ ఉన్న స్కూళ్లల్లో ఉన్నవారిని రిలీవ్చేయబోమని పేర్కొంటున్నారు. అంతవరకు బదిలీ అయిన వారు పాత స్థానాల్లోనే కొనసాగాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మంగళవారం మీడియాకు తెలిపారు.
ఎస్జీటీలకు తీరని నష్టం
ఈ విధానంతో సెకండరీ గ్రేడ్ టీచర్లకు తీరని నష్టం కలుగుతున్నది. 18వేల మంది టీచర్లకు పదోన్నతులివ్వగా, వీరిలో 11వేలకు పైగా హెచ్ఎంలు, భాషాపండితులు, పీఈటీలున్నారు. మరో 6 వేల మంది ఎస్జీటీలు ఉన్నారు. కొన్ని స్కూళ్లల్లో ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉంటే ఇద్దరు పదోన్నతి పొంది వెళ్లిపోగా, మిగిలిన ఒక ఎస్జీటీ బదిలీ అయినా ఆయా టీచర్ను రిలీవ్చేయలేదు.
సెప్టెంబర్ తర్వాతే కొత్త టీచర్లు
11,062 పోస్టులకు ఈ నెల 18 నుంచి డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. కీ పేపర్లను విడుదలచేసి, ఫలితాలు ప్రకటించే వరకు సెప్టెంబర్ దాటుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో బదిలీ అయిన టీచర్లు ఇప్పట్లో రిలీవ్ అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇక 1 -10 మంది విద్యార్థులున్న బడులకు ఒక టీచర్, 11 -40 మంది వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు టీచర్లను కేటాయిస్తామన్న విద్యాశాఖ తాజాగా మంగళవారం దీనిని మార్చింది. 1 -19 మంది విద్యార్థులకు ఒక టీచర్కు మార్చారు. దీంతో 2వేల స్కూళ్లకు ఒకే ఒక్క టీచర్ ఉండనున్నారు. ముందు ఒకలా చెప్పి, తర్వాత మరొకలా వ్యవహరించడమేంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
బదిలీలు చేసి ప్రయోజనమేంటి: పీఆర్టీయూ
బదిలీ చేసిన ప్రాథమిక పాఠశాల టీచర్లను రిలీవ్చేయకపోవడం దారుణమని పీఆర్టీయూ తెలంగాణ అభిప్రాయపడింది. రిలీవ్ చేయనప్పుడు బదిలీ చేసి ప్రయోజనమేంటని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ ప్రశ్నించారు. రేషనలైజేషన్ నిబంధనల పేరుతో రిలీవ్చేయకపోవడాన్ని ఖండించారు. ఇది ఎస్జీటీలపై సవతితల్లి ప్రేమను చూపడమే అవుతుందని మండిపడ్డారు.
మూడు నెలలకోసారి ప్రత్యేక బదిలీలు
టీచర్ల బదిలీల వినతులు, అప్పీళ్లను మూడు నెలలకొకసారి పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దివ్యాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. ఇందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమిస్తుంది. ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది. అర్హులైన వారు ఈ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మూడు నెలలకొకసారి సమావేశయ్యే కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి, ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తుంది.