హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారును గద్దె దించేదాకా పోరాబాట వీడమని నిరుద్యోగ యువత ప్రతినబూనింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండటంపై భగ్గుమంది. నాటి హామీలు నీటి మూటలయ్యాయని, నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. పక్షం రోజులుగా ఉద్యమిస్తున్నా నిమ్మకు నీరెత్తినటు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగుల సమస్యలన్నీ తీరుస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరుద్యోగులం కడదాకా ఉద్యమస్తాం. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతాం. బీఆర్ఎస్ పార్టీని కాదని అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులకు కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఇక రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరుబాట వీడం.
– అనిల్
ఎంతోకాలంగా ఎదురుచూసిన గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఎంతోమందికి వయసు దాటిపోతుంది. మరో నోటిఫికేషన్ కోసం ఎదురుచూడాలని కాంగ్రెస్ నేతలు చెప్పడం దుర్మార్గం. ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకటించే అవకాశాలు తక్కువ. అందుకే ఈ నోటిఫికేషన్లోనే పోస్టుల సంఖ్య పెంచాలి.
– అర్జున్