హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘హలో నిరుద్యోగి.. చలో టీజీపీఎస్సీ’ పేరుతో ఈ నెల 5న నిరుద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాకు భారీ సంఖ్యలో సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. గ్రూప్స్ ఉద్యోగాలు, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ పోరాటానికి వివిధ పక్షాలు విశాల మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఓయూ విద్యార్థి మోతీలాల్నాయక్ వారంపాటు గాంధీ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేశారని, ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదని నిరుద్యోగ జేఏసీ నేత లు మండిపడ్డారు. కనీసం ప్రభుత్వ పెద్దలు మో తీలాల్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహించారు. నిరుద్యోగ యువతతో చర్చ లు జరిపి, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు నిరుద్యోగుల పక్షాన బీసీ జనసభ పోరాటం చేస్తుందని బీసీ జనసభ అధ్యక్షుడు, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారామ్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5న నిరుద్యోగులు చేపట్టిన మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములం అవుతామని ప్రకటించారు. నిరుద్యోగుల కోసం అన్నివర్గాల ప్రజలు, విద్యార్థి సంఘాలు భాగస్వామ్యం కావాలని రాజారామ్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచైనా, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేసేంత వరకు విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.