హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డుకొని స్టేషన్లకు తరలించారు.
నిరుద్యోగులు, పోలీసులకు జరిగిన తోపులాటలో బీజేవైఎం కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను నాంపల్లిలోని ఓ దవాఖాను తరలించారు. ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్ద నినాదాలు చేశారు. కార్యక్రమంలో మహేందర్, మహేశ్, శ్రీనివాస్, రాకేశ్, వెంకట్ నిరుద్యోగులు పాల్గొన్నారు.
సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటాం
నిరుద్యోగులు, విద్యార్థులు రాజధానిలో రోజుకో చోట నిరసనలకు దిగుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల సంఖ్యల పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను పిలువాలని, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3వేలు, డీఎస్సీలో 25వేల చొప్పున పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందిరాపార్కు, టీజీపీఎస్సీ గేట్ల ఎదుట ధర్నాలు, రాష్ట్ర సచివాలయన్నే ముట్టడించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడెందుకు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
ఉస్మానియావర్సిటీలో నిరుద్యోగులు జేఏసీగా ఏర్పాటై డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి ఉద్యమాలు మొదలుపెట్టారు. వివిధ దశల్లో ఉద్యమాలు చేస్తామంటూ ఓయూ వేదికగా నిరుద్యోగులు ప్రతినబూనారు. ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికీ సిద్ధంగా ఉన్నట్టు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు.