Rationalization | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లేదు లేదంటూనే పాఠశాల విద్యాశాఖ బడుల రేషనలైజేషన్ను అమలుచేసింది. రేషనలైజేషన్ ప్రకారమే టీచర్లను బదిలీచేసింది. దీంతో పలు స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు. విద్యార్థుల సంఖ్యలేని పలు పాఠశాలల్లోని పోస్టులను పక్కనపెట్టింది. కాగా, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లల్లో బదిలీ అయినా టీచర్లను రిలీవ్ చేయలేదు. పాత స్థానాల్లోనే ఉండాలని సూచించింది. దీంతో సంవత్సరాలుగా ఒకేచోట పనిచేస్తూ తాజాగా బదిలీ కాగా, ఈ నిర్ణయంతో వారి ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. దీనిని పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. బదిలీ అయిన వారిని రిలీవ్చేయాలని డిమాండ్ చేశాయి.
బదిలీఅయిన టీచర్లందరిని వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. అవసరమైతే విద్యావలంటీర్లను నియమించాలని రాష్ట్ర అధ్యక్షుడు కే హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ కోరారు. చాలా మందిని రిలీవ్ చేయకపోవడంతో ఎస్జీటీలు ఎక్కడివారు అక్కడే ఉండే పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. యూపీఎస్లోని ఎస్జీటీ పండితులను సైతం రిలీవ్చేయాలని సూచించారు.
బదిలీ అయిన టీచర్లను రిలీవ్చేయాలని డిమాండ్చేస్తూ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టింది. అంతర్గత రేషనలైజేషన్ వల్ల విద్యార్థులకు గుణాత్మకమైన విద్య దూరమవుతుందని అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి పాఠశాలను తెరవాలన్న హామీని సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 50,808 మంది ఎస్జీటీలు(సెకండరీ గ్రేడ్ టీచర్లు) పని చేస్తుండగా, సోమవారం 25,036 మంది బదిలీ అయ్యారు. అంటే 50శాతం టీచర్లకు స్థానచలనం కలిగింది. ఇక రంగారెడ్డి జిల్లాలో 955 మంది స్కూల్ అసిస్టెంట్లు స్థానం చలనం పొందారు. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లను బదిలీ చేస్తారు. దీంతో రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య ముగుస్తుంది.