Nallamala Forest | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతం అభివృద్ధికి అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నాగార్జునసాగర్ డివిజన్ చందంపేట మండలం కంబాలపల్లి రేంజ్లో నల్లమల అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న ‘రాబంధుల’ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పాటు రెండు పెద్దపులులు సంచరిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్లగొండ, కర్నూలు జిల్లాల్లో 26,795 హెక్టార్ల వరకు అటవీ ప్రాం తం విస్తరించి ఉంది. కంబాలపల్లి రేంజ్లో రెండు పెద్దపులులు, రాబందులు సంచరించడం ఇదే ప్రథమమని డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వర్రావు తెలిపారు.
సీసీ కెమెరాల్లో వన్యప్రాణుల సంచారం నమోదైనట్టు తెలిపా రు. అటవీ జంతువుల సంరక్షణకు కేంద్రప్రభుత్వం 4.50 కోట్లు విడుదల చేయగా.. ఆ నిధులతో అటవీశాఖ నల్లమల అటవీ ప్రాం తంలో అటవీ అభివృద్ధి, వన నర్సరీలు, రో డ్డు, చెక్ డ్యాంలతోపాటు 50కి పైగా సీసీ కెమెరాలతో నిఘా, వాచ్టవర్, బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం చుట్టూ ఇనుపగేట్లు, కంచె ఏర్పాటుచేశారు. వన్యప్రాణుల దాహార్తికి నల్లమలలో 150 కిపైగా నీటితొట్లు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేశారు.