హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈ ప్రభుత్వంలో ఆరు రకాల అవినీతిని ఆధారాలతో బయటపెట్టినా, ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. తాను పౌరసరఫరాల శాఖలో అవినీతిని బయటపెట్టినా కనీసం స్పందించని అసమర్థ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అని మండిపడ్డారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ రూ.వందల కోట్లు దోచుకుంటున్నారని, అయినా మంత్రికి చీమ కుట్టనట్టు కూడా లేదని ఆరోపించారు. ఆయన ఆధ్వర్యంలోని నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిని కూడా త్వరలో ఆధారాలతో బయటపెడతానని చెప్పారు.
కాళేశ్వరంపై త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, పాలనను గాలికొదిలి ఢిల్లీలో తిరుగుతున్నారని విమర్శించారు. ఢిల్లీ నుంచి రాగానే నేరుగా ప్రైవేట్ దవాఖాన ప్రారంభోత్సవానికి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటిముందు డప్పులు కొట్టాలని చెప్పారని, మరిప్పుడు ఎక్కడ కొట్టాలో చెప్పాలని ఎద్దేవాచేశారు.
ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదని, అయినా దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చెప్పారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, వారు రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామని, లేదా పూర్తిగా ఎల్పీని విలీనం చేసుకుంటామని వెల్లడించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఏలేటి మహేశ్వర్రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదుచేశారు. సోమవారం ఆయన స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు లేఖను అందజేశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదును మెయిల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా స్పీకర్కు పంపించానని చెప్పారు. సుప్రీం తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపు చేసిన దానంపై 90 రోజుల్లో చర్యలు తీసుకోవాలని కోరారు.