హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి నియంతలా మారి నిరుద్యోగులపై నిర్బంధం మోపుతున్నారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం మోతీలాల్నాయక్ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే సర్కారుకు చీమకుట్టినట్టుకూడా లేదని పేర్కొన్నారు. ఏడాదిలోపే హిట్లర్కు తాతలా ప్రవర్తిస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని నవతరం ముకు నేలకు రాయించడం ఖాయమని హెచ్చరించారు.
నిరుద్యోగుల డిమాండ్లపై తక్షణమే సీఎం స్పందించి నిర్ధిష్టమైన చర్యలు చేపట్టకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఉద్యమిస్తున్న లక్షలాది నిరుద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతున్న సీఎంకు నిరుద్యోగులను కలిసే తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. త్వరలో జాబ్ క్యాలెండర్ పేరిట వార్తల లీకులతో ప్రభుత్వం యువతను మభ్యపెట్టే ఎత్తులు వేస్తున్నదని ఆరోపించారు. టీజీపీఎస్సీ ముట్టడికి అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు పలకాలని ఆంజనేయగౌడ్ కోరారు.