Congress Govt | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పేరుకు మా త్రమే బలహీనవర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దాదాపు 80 శాతానికి పైనే ఉన్నా.. పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అత్యధిక జనాభా కలిగిన బలహీనవర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడంలో ఎప్పుడూ చిన్నచూపేనన్న విమర్శ మొదటినుంచీ ఉన్నది. రేపో, మాపో జరుగబోయే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతపై చర్చ జరుగుతున్నది. జనాభా దామాషా ప్రకారం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కడం లేదని బలహీనవర్గాలు వాపోతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్, రాష్ట్రంలో తమ ప్రభుత్వంలో మాత్రం ఆ వర్గాలకు తగిన భాగస్వామ్యం కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంబలహీన వర్గాల కంటే అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది. ప్రస్తుత మంత్రిమండలిలో సీఎం రేవంత్రెడ్డి సహా 12 మంది ఉండగా, వారిలో ఏడుగురు ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. ఏడుగురు ఓసీలలో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా, మిగతా ముగ్గురిలో ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ, మరొకరు వెలమ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. మిగతా ఐదుగురిలో ఇద్దరు ఎస్సీలు (భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ), ఇద్దరు బీసీలు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్), ఎస్టీ (సీతక్క) ఉన్నారు.
రేపో, మాపో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలోనూ తమకు న్యాయమైన వాటా దక్కుతుందన్న గ్యారెంటీ లేదని బడుగు, బలహీనవర్గాలకు చెందిన నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ కథనం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో నలుగురికి చోటు కల్పించనుండగా వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి, మరో ఇద్దరు బీసీలకు అవకాశం ఉంటుందని తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పీ సుదర్శన్రెడ్డికి చోటు కల్పించబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న నలుగురు ‘రెడ్డి’ మంత్రుల సంఖ్య ఆరుకు చేరుకోనుండగా, ఓసీ మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరుకోనుంది. మరో ఇద్దరు బీసీలు.. వాకిటి శ్రీహరి (మక్తల్), దానం నాగేందర్ (హైదరాబాద్)కు కూడా మంత్రి పదవులు దక్కుతాయని మంత్రి పేర్కొన్నారు. అప్పుడు బీసీ మంత్రుల సంఖ్య నాలుగుకు చేరుకోనుంది. మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిందే నిజమైతే రాష్ట్ర మంత్రిమండలిలో అగ్రకులాల వారికే పెద్దపీట దక్కనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక సమతుల్యం లోపించినట్టు అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదనే విమర్శలను అధిగమించేందుకుగాను ఆ సామాజికవర్గానికి పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అధికారమంతా సీఎం చేతిలోనే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మరో పవర్ సెంటర్ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు.
పీసీసీకి కొత్త అధ్యక్షునిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేరును సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం. ఏదైనా కారణంగా మహేశ్కుమార్గౌడ్కు బాధ్యతలు అప్పగించలేనిపక్షంలో మహబూబాబాద్ ఎంపీ బల్రాంనాయక్ పేరును కూడా రేవంత్రెడ్డి సూచించినట్టు చెప్తున్నారు. తమ దృష్టిలో వీరిద్దరూ డమ్మీ అభ్యర్థులేనని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.