TGPSC | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల పోరుబాటతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే.. ప్రభుత్వం తన మంకుపట్టు వీడటం లేదు. నోటిఫికేషన్ల ప్రకారమే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ముందుకు సాగుతున్నది. దీంతో రగిలిపోతున్న నిరుద్యోగులు పోరుబాట వీడటం లేదు. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ల ప్రకారమే ఉంటుందని టీజీపీఎస్సీ కమిషన్ తేల్చిచెప్పింది.
ఈ మేరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిని పాటించాలన్న డిమాండ్ను నిరుద్యోగులు బలంగా వినిపిస్తున్నారు. టీజీపీఎస్సీ మాత్రం 1:50 నిష్పత్తితోనే మెయిన్స్కు ఎంపిక చేస్తామని స్పష్టంచేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంతో పాటు గ్రూపు 2, 3లో అదనపు పోస్టులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అవేమీ తమకు పట్టవన్నట్టుగా టీజీపీఎస్సీ మాత్రం నోటిఫికేషన్ల ప్రకారంగా చర్యలు కొనసాగిస్తున్నది.
షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ప్రశ్నాపత్రం రూపకల్పన దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. పరీక్ష కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి హాల్టికెట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ఫలితాలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే మెయిన్స్కు 1:50 నిష్పత్తి ప్రకారం ఫలితాల విడుదల చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కసరత్తు జరుగుతుంది. గ్రూప్-3 పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని టీజీపీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి.