TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల బలమైన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని పేర్కొంది. రాబోయే రెండురోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం నుంచి సోమవారం వరకు మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. జూలై 2 వరకు ఆదిలాబాద్, ఆసిఫ్రాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కొత్తగూడెం, హన్మకొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 87 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.