NHAI | హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభిందించి. ఈ మేరకు ఆరు లేన్ల విస్తరణకు జాతీయ రహదారుల శాఖ(ఎన్హెచ్ఏఐ) సన్నాహాలు చేస్తున్నది. కాంట్రాక్టు నుంచి జీఎమ్మార్ సంస్థ వైదొలగడంతో వచ్చే నెలలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. రెండేండ్లలోగా తెలంగాణలోని దండుమల్కాపూర్ నుంచి ఏపీలోని నందిగామ వరకు సుమారు 181.5 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
హైదరాబాద్-విజయవాడ హైవేను దశలవారీగా 2024 వరకు ఆరులేన్లుగా విస్తరించాల్సి ఉన్నది. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థ 2010లో అప్పటి యూపీఏ హయాంలో పనులు మొదలుపెట్టి 2012 వరకు నాలుగు లేన్లుగా విస్తరించింది. అనంతరం ఆరులేన్ల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నది. రాష్ట్ర విభజన వల్ల టోల్ వసూళ్లు తగ్గిపోయాయనే కారణంతో జీఎమ్మార్ సంస్థ పనులు చేపట్టలేదు. టోల్ వసూళ్ల గడువు కూడా పెంచాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆరు లేన్ల విస్తరణ పనులు అటకెక్కాయి. దీంతో ఈ మార్గంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు రాష్ట్రంలోని రోడ్డు ప్రాజక్టులపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన చర్చల సందర్భంగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులనూ చేపట్టాలని కోరారు. ఈ మేరకు వెంటనే హైవే విస్తరణ పనులు చేపట్టాలని కేంద్రమంత్రి గడ్కరీ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంగా ఎన్హెచ్ఏఐతో జరిపిన చర్చల అనంతరం జీఎమ్మార్ సంస్థ కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. దీంతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే జూలైలో టెండర్ల ప్రక్రియ చేపట్టి సాధ్యమైనంత తొందరలో పనులు చేపట్టాలని, వచ్చే రెండేండ్లలోనే పనులు పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. జీఎమ్మార్ సంస్థ కాంట్రాక్టు నుంచి వైదొలగడంతో వచ్చే నెల నుంచి టోల్ వసూళ్ల బాధ్యతను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు.