హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు మంగళవారం నుంచి నిర్వహించనున్న సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. తమకు గౌరవ వేతనం అందడం లేదంటూ, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ మంగళవారం నుంచి ఓపీ, ఆపరేషన్ థియేటర్ సేవలను బహిష్కరించనున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించాయి.
సోమవారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ సంయుక్తంగా జూనియర్ డాక్టర్ల, ఎస్ఆర్డీఏ సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని చర్చలు జరిపారు. ైస్టెపెండ్ ఎందుకు ఆలస్యమైందో వివరించారు. అనంతరం మంత్రి రాజనర్సింహ వారితో ఫోన్లో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. మంగళవారం సచివాలయానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సంఘాలు ప్రకటించాయి. మంత్రితో చర్చల అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపాయి.