హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల పెండింగు బిల్లులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాష్ట్ర సర్పంచుల సంఘం కోరింది. గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు జీతాలు తక్షణం ఇచ్చేలా అసెంబ్లీలో గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేసింది.
బుధవారం బంజారాహిల్స్ నందినగర్లోని నివాసంలో కేటీఆర్ను కలిసి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు.
నేడు గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏడు నెలల్లో నయా పైసా కూడా పల్లె, పట్టణాలకు విడుదల చేయలేదని విమర్శించారు. పెండింగ్ బిల్లులపై గవర్నర్కు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనమూ లేదని మండిపడ్డారు. సఫాయి కార్మికులకు ఏడు నెలలగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు బొజ్జ రామేశ్వర్రెడ్డి, యాదిరెడ్డి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.