Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇవ్వాలి అనుకున్నవాళ్లు 8712671111 నంబర్కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, అందుకోసం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా విస్తృత ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్పై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయనలా హీరో, హీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పౌరులకు అవగాహన కల్పించాలని కోరారు. మీడియా ఫోకస్ రాజకీయ అంశాలకే పరిమితం కాకూడదని, డ్రగ్స్, సైబర్ నేరాలపైనా దృష్టిసారించాలని రేవంత్రెడ్డి సూచించారు.
ఈ యజ్ఞం విజయవంతమయ్యేందుకు పౌరసంబంధాలశాఖ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, థియేటర్ యజమానులు, సినిమా ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై చిత్తశుద్ధితో పనిచేసే పోలీసులకు పదోన్నతులు, రివార్డులు ఇస్తామని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్స్, డ్రగ్సేనని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నేరాలు, చిన్నారులపై అఘాయిత్యాలు డ్రగ్స్ మత్తులో జరిగినవేనని పేర్కొన్నారు. ఉద్యమాలకు కేరాఫ్గా ఉన్న తెలంగాణ డ్రగ్స్కు బానిస కావొద్దని పిలుపునిచ్చారు.