Minister Sridhar Babu | ఔటర్ రింగ్ రోడ్ ఇరువైపులా మున్సిపాలిటీలకు ఆనుకుని గ్రామ పంచాయతీలన్నిటిని పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలను తెలంగాణా కోర్ అర్బన్ రీజియన్గా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. సిటీ, శివారు మున్సిపాలిటీల నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న 23 గ్రామ పంచాయతీల విలీనం, పునర్వవస్థీకరణపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా ఉన్నారు.
ఈ నేపథ్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన క్యాబినెట్ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి క్యాబ్నెట్ సబ్ కమిటీ సభ్యులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్ధీన్ ఒవైసీ, గూడెం మహిపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్ గౌడ్, రాష్ట్ర పట్టణాభి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలను పునర్వవస్థీకరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పారిశ్రామిక క్లస్టర్లు వస్తాయని, మౌలిక వసతుల పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య లింక్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. దీని వల్ల కనెక్టివిటీ పెరిగి గ్రామాల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు.