TGSPSC | హైదరాబాద్ : గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుల పెంపు కోసం మార్చి నుంచి వివిధ సందర్భాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారిస్తోంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై స్పందించలేదు.
ఈ క్రమంలో నిరుద్యోగ యువత టీజీఎస్పీఎస్సీ ముట్టడికి శుక్రవారం పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు టీజీఎస్పీఎస్సీ ముట్టడికి బయల్దేరారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని, వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల బారికేడ్లను ఛేధించుకొని ఓ యువతి టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు దూసుకొచ్చి తన నిరసనను వ్యక్తం చేసింది.
గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల సంఖ్య పెంచాలని గత నాలుగైదు నెలల నుంచి డిమాండ్ చేస్తున్నామని, కానీ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని వాపోయింది ఆ యువతి. పోలీసులను అడ్డుపెట్టుకుని నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తుందని కన్నీరు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే నిరుద్యోగులు చేసిన పాపమా..? అని ప్రశ్నించింది. నిరసన తెలపడం మా న్యాయమైన హక్కు. నిరుద్యోగుల నిరసనలకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా..? అని నిలదీసింది. అంత భయం ఉంటే మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. త్వరలోనే ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతామని ఆ యువతి స్పష్టం చేసింది.
TGSPSC ముందు నిరుద్యోగ యువతి ఆందోళన pic.twitter.com/H5whM1FS0X
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024
TGSPSC వద్ద కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళన pic.twitter.com/VsF1bZEJQk
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024