KTR | హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను నిరుద్యోగులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్-1, 2తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులతో సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చినా అమలు చేయడం లేదని నిరుద్యోగులు చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. గ్రూప్-2లో రెండు వేల ఉద్యోగాలు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారు. తెలంగాణ యువత తరపున కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాం. గ్రూప్-2, 3 పోస్టులను పెంచుతామని చెప్పి తప్పించుకున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే పది నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండే.. ఇవ్వలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని విపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నాడు భట్టి విక్రమార్క చెప్పిన మాటను ఇప్పుడు నిలుపుకోవాలి. దీని వల్ల ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. గ్రూప్స్ కోసం ప్రిపేర్ కావడానికి అభ్యర్థులకు సమయం దొరికేలా పరీక్షలు నిర్వహించాలి. నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తది. కదం తొక్కుతాం.. నిరుద్యోగులే కథా నాయకులై ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తది. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని ఈ విషయంలో ప్రభుత్వం పై పోరాటానికి తమకు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన నిరుద్యోగ అభ్యర్థులు. pic.twitter.com/UWXPcxb622
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024