హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నమోదైన రైల్రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. చార్జిషీట్లోని అంశాలను పరిశీలిస్తే రైల్రోకో కార్యక్రమంలో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనలేదని తేలుతున్నదని అభిప్రాయపడింది. రైల్రోకోలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతోపాటు మిగిలినవారిని అరెస్ట్ చేసినట్టు రికార్డుల్లో ఉన్నదని తెలిపింది. అందువల్ల కేసీఆర్పై కేసును కొనసాగించడం చట్టప్రక్రియను దుర్వినియోగపరచడమేనని వ్యాఖ్యానించింది. అందుకే ఆ కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో కోర్టు రైల్వే పోలీసులతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.
హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలే కేసీఆర్ సాధించిన అతిపెద్ద విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ఫార్మర్ ఫస్ట్ అన్నది కేసీఆర్ నినాదం మాత్రమే కాదని, దానికి మద్దతుగా అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు రైతుబంధు పేరుతో దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ ఇన్పుట్ సహాయ కార్యక్రమం ద్వారా 70 లక్షల మంది రైతులకు రూ.73,000 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. రైతు బీమా ద్వారా మృతిచెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా అందించారని, రెండు విడతల్లో రూ.25,000 కోట్ల వరకు రైతు రుణాలను మాఫీ చేశారని, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుజ్జీవనం కల్పించారని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ వంటి నీటి పారుదల ప్రాజక్టులను నిర్మించారని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ప్రాజెక్టులు, కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్ణయాలపై తమ ముందు విచారణకు హాజరుకావాలని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసు పంపింది. ఈ నెల 19న నోటీసు పంపిన కమిషన్ వారం రోజుల గడువు విధించింది. ఆ గడువు బుధవారంతో ముగియనుంది. కమిషన్ ఆప్ ఎంక్వైరీ యాక్ట్ -1952 సెక్షన్ 8 (బీ), సెక్షన్ 8 (సీ) ప్రకారం ప్రత్యక్షంగా హాజరై, తగు ఆధారాలను కమిషన్ ముందు సర్పించాలని సూచించింది.
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్ కేసీఆర్కు గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖకు స్పందనగా జూన్ 14న కేసీఆర్ 12 పేజీల వివరణను కమిషన్కు పంపించారు. ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరవ్వాలని కేసీఆర్ను కోరింది. ఇదే అంశంపై ఇప్పటికే విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు.. గతంలో విచారణకు హాజరైన వారిలో మరికొందరిని మరోసారి విచారణకు హాజరవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది.