Telangana | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటిఫికేషనే చెల్లదని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి స్పష్టం చేశారు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడీషియల్ కమిషన్ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. విద్యుత్తు వ్యవహారాలపై ఎంవోయూ, విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు చేపట్టే అంశంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి.
పిటిషన్ విచారణకు స్వీకరించేదీ, లేనిదీ సోమవారం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం వాదనలు విన్నది. పిటిషనర్ కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషనే చెల్లదని పేర్కొన్నారు. ‘విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఈ ఏడాది మార్చి 14న జారీచేసిన జీవో ఎంఎస్ నంబర్ 9లో కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ -1952 ప్రకారం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడీషియల్ కమిషన్ను ఎలా నియమిస్తారు?’ అని ప్రశ్నించారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ పూర్తి చేయకుండానే అసంపూర్తి వివరాలను ఆధారంగా చేసుకుని విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్ల వల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరిందని మీడియాతో చెప్పడం కూడా తీవ్ర విషయమని సోంధీ వాదించారు. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కమిషన్కు న్యాయపరమైన అధికారాలు లేవని, అది సమర్పించే నివేదికకు కట్టబడి ఉండాలని (బైండింగ్ కాదు కదా) కూడా లేదని, కేవలం నిజనిర్ధారణ నివేదికను మాత్రమే ఇస్తుందని, ఈ వ్యవహారంపై అభ్యంతరం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై సోంధి స్పందిస్తూ ‘నిజ నిర్ధారణ చేయాల్సిన కమిషన్ విచారణ పూర్తి చేయకుండానే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగం వల్ల ప్రభుత్వానికి ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పింది. తద్వారా కమిషన్ నివేదిక సమర్పించడానికి ముందే అందులో ఏం ఇవ్వబోయేది వెల్లడించారు’ అని పేర్కొన్నారు. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను కొనసాగిస్తే ముందే నిర్దేశించిన మేరకు నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఆర్థిక అంశాలు, ప్రభుత్వానికి ఆర్థికపరమైన నష్టాలు వంటి విషయాల్లోకి వెళ్లడం ద్వారా విచారణ పరిధిని కమిషన్ అతిక్రమించినట్టేనని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రవర్తన నిష్పక్షపాతంగా లేదని నిరూపణ అవుతున్నదని పేర్కొన్నారు. ‘సాక్షులను విచారించి నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్.. విలేకరుల సమావేశం నిర్వహించడం చెల్లదని ఏలేరు సాంపై ఏర్పాటైన జస్టిస్ బీకే సోమశేఖర కమిషన్ తీర్పును హైకోర్టు తప్పుపట్టింది’ అని గుర్తు చేశారు. ప్రధాన న్యాయమూర్తి మరోసారి కల్పించుకుని, కోట్ల విజయభాసర్రెడ్డి-ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో ఎంక్వయిరీ కమిషన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించలేదు కదా, ఆ కేసు తీర్పును ఉదహరించడాన్ని సమర్థిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి ఆదిత్య సోంధి బదులిస్తూ ‘జస్టిస్ నర్సింహారెడ్డి ముందుగా పిటిషనర్ వాదనలు వినాల్సి ఉన్నది. పిటిషనర్ చెప్పబోయేది ఏమిటో తెలుసుకోకుండానే ఆర్థిక నష్టాలు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ను బొగ్గు గనులకు దూరంగా పెట్టడం వల్ల నష్టాలు, రైలు ట్రాక్ ఇంకా జాప్యం అవుతుందనే అంశాలను బాహాటంగా వెల్లడించడం వల్ల కమిషన్ పనితీరుపై సందేహాలు ఏర్పడుతున్నాయి’ అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి వ్యక్తిగత ప్రతివాదిగా ఉన్నారని, ఆయనకు నోటీసులు జారీ చేసే పరిస్థితులు రాకుడదని చెప్పారు. ఆయనను ప్రతివాదిగా చేర్చడమే చెల్లదని స్పష్టం చేశారు. విచారణ కమిషన్ల నియామకాలపై కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని ఏజీ వాదించారు. కోట్ల విజయభాసర్రెడ్డి-ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులోనూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదే రకమైన తీర్పులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఈ దశలో ప్రధాన న్యాయమూర్తి కల్పించుకుని ఎంతమందిని సాక్షులను విచారించారు? జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 20 నుంచి 23 మంది వరకు సాక్షులను కమిషన్ విచారించిందని, జెన్కో, ట్రాన్స్కో, ఆ సంస్థల చైర్మన్గా చేసిన ప్రభాకర్రావు, విద్యుత్తుశాఖ అధికారులను విచారించిందని బదులిచ్చారు. జస్టిస్ నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో పలానా వాళ్లు తప్పు చేశారనే అభియోగాలు చేయలేదని తెలిపారు.
బీహెచ్ఈఎల్కు కాంట్రాక్టు ఇచ్చారని, టెండర్ విధానాన్ని అమలు చేయలేదని, విద్యుత్తు నిర్మాణ ప్లాంట్ పూర్తయితే బొగ్గు రవాణాకు నిర్దేశించిన రైలు ట్రాక్ పనులు ఆలస్యం అవుతున్నాయన్న విషయాలు వెల్లడించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. నాటి పత్రికలు పరిశీలిస్తే ఆ విషయాలన్నీ తెలుస్తాయని చెప్పారు. కమిషన్ బహిరంగ విచారణ చేస్తున్నందున కొన్ని విషయాలు వెల్లడిస్తే తప్పేమీకాదని పేర్కొన్నారు. తాను విచారణకు సిద్ధమేనని నాటి విద్యుత్తుశాఖమంత్రి ఇటీవల అసెంబ్లీలో ఒప్పుకున్నారని గుర్తుచేశారు. రామకృష్ణ దాల్మియా-కర్ణాటక మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ‘కమిషన్ నిజ నిర్ధారణ నివేదికను మాత్రమే ఇస్తుంది. ఆ నివేదికతో సంతృప్తి చెందకపోతే న్యాయపోరాటం చేసుకునే వెసులుబాటు పిటిషనర్కు ఉంది’ అని పేర్కొన్నారు. ఆదిలోనే కమిషన్ విచారణను నిలుపుదల చేయాలని కోరడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని సుదర్శన్రెడ్డి ధర్మాసనాన్ని కోరారు.