పైచిత్రంలో ఇద్దరు బిడ్డలతో కలిసి ప్లకార్డులు తయారుచేస్తున్నది సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బూడిద యోగి. ఇటీవల ట్రిబ్ ప్రకటించిన 1:2 జాబితాలో ఉన్నాడు. ప్రభుత్వం రిలింక్విష్మెంట్ విధానాన్ని అమలుచేస్తే ఉద్యోగం కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఆశతోనే దాదాపు 4 నెలలుగా ఎదురు చూస్తున్నాడు. సహచర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వ పెద్దలు, కార్యాలయాల చుట్టూ భార్యతో సహా ప్రదక్షిణలు చేస్తున్నాడు. తండ్రి వేదనను చూడలేక పిల్లలు దీక్షిత, ప్రసన్న బాసటగా నిలుస్తున్నా కాంగ్రెస్ సర్కారు నుంచి మాత్రం స్పందన కరువైంది. గురుకుల అభ్యర్థులు పడుతున్న అరిగోసకు ఈ చిత్రమే నిదర్శనంగా నిలిచింది.
Telangana | హైదరాబాద్, జూన్26 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు అంతిమంగా నిరాశే మిగిలింది. సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ ఇమేజ్ కోసం అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టారు. నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల్లో భారీగా మిగిలిపోతుంటే, మరోవైపు వేలాది మంది అభ్యర్థుల ఆశలకు గండిపడుతున్నది. ఈ నేపథ్యంలో రీలింక్విష్మెంట్ను అమలు చేసి ఒక్కపోస్టు కూడా మిగలకుండా భర్తీచేస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దలు, అధికారుల చుట్టూ తిరుగుతూ నాలుగు నెలలుగా అరిగోస పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ట్రిబ్ నోటిఫికేషన్ను జారీచేసింది. ఆగస్టులో రాత పరీక్షలను నిర్వహించింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈలోగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల లబ్ధి కోసం అభ్యర్థులను ఆగం చేసింది. అర్హులే లేరంటూ అధికారికంగానే ట్రిబ్ 404 పోస్టులను నింపనేలేదు. డీసెండింగ్ ఆర్డర్కు తిలోదకాలిచ్చింది. రాత్రికి రాత్రే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి, తుది జాబితాలను ప్రకటించి, అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. దీంంతో ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న దాదాపు 2,500 పోస్టులు బ్యాక్లాగ్ పడుతున్నాయి.
ఆ నలుగురిపై అభ్యర్థుల ఆగ్రహజ్వాల
నలుగురు కాంగ్రెస నేతల తీరుపై గురుకుల అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు తమతో ధర్నాలు చేయించిన ఆ నేతలే నేడు తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ యువ నాయకుడితోపాటు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న మరో కీలక నేత ఇప్పుడు తమ సమస్యను పట్టించుకోవడమే లేదని వాపోతున్నారు. నేడు, రేపు అంటూ దాటవేస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలను ఇప్పించలేకపోతున్నారని మండిపడుతున్నారు.
ఇదేమని అడిగితే ఉన్నత పదవిని దక్కించుకున్న మరో కాంగ్రెస్ నేత తమనే దుర్భాషలాడుతున్నారని, పదవులు దక్కించుకొని నేడు పెదవులు మూసుకున్నారని అభ్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఇదే అంశంపై సర్కారు పెద్దలతో చర్చిస్తానని సదరు యువనేత ఇచ్చిన హామీ సైతం ఉత్తముచ్చటే అయ్యిందని, ఇప్పుడు పో స్టింగ్స్ ఇచ్చిన తర్వాత అయినా ఇప్పిస్తానని మ భ్యపెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని గురుకుల అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా సొసైటీలు పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాయని, రీలింక్విష్మెంట్ అమలు చేయకుండా పోస్టింగ్స్ ఇచ్చాక చేసేదేమీ లేదని అభ్యర్థులు వాపోతున్నారు. రీలింక్విష్మెంట్ అమలుకోసం ఆమరణ దీక్షకు చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకొంటున్నామని చెప్పారు. అందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి ఎదుట మోకాళ్లపై కూర్చొని ధర్నాకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగాలను భర్తీ చేయాలని వారంతా డిమాండ్ చేశారు.