హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు. చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్ను విద్యుత్ శాఖ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఉన్న శ్రీదేవసేనను కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమించారు. ఆయనకు టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్రెడ్డిని నియమించారు. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్ఎండీఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు.