Telangana | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ నీటి మూటగానే మిగిలింది. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న వాటికి కేటాయించనేలేదు.
విద్యార్థులున్న పాఠశాలలకే ఉపాధ్యాయులను కేటాయిస్తూ వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఒకరు, 11 నుంచి 40 మంది వరకు ఉన్న పాఠశాలలకు ఇద్దరు, 41 నుంచి 60 మంది ఉన్న పాఠశాలలకు ముగ్గురు, 61, ఆపైన విద్యార్థులున్న పాఠశాలలకు మంజూరైన అన్ని పోస్టులను భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్లను కేటాయించింది. తాజా ప్రకటనతో ముఖ్యమంత్రి హామీ ఇప్పట్లో అమలయ్యేలా లేదని తేలింది.
రాష్ట్రంలో మూతపడిన ప్రభుత్వ బడులను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆ బడులను తెరిపించేందుకు ఉపాధ్యాయులను కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో విద్యార్థులు లేక (జీరో ఎన్రోల్మెంట్) మూతపడిన 1,739 ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెరుచుకుంటాయని ప్రజలు ఆశించారు. కానీ, ఆ పాఠశాలలకు తాజాగా ఒక్క ఉపాధ్యాయుడినీ ప్రభుత్వం కేటాయించలేదు.