Minister Sridher Babu | హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): అమెరికా పర్యటనలో భాగంగా స్వచ్ఛ్ బయో సంస్థకు ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని చెప్పారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ విదేశీ పర్యటన వివరాలను మంత్రి వెల్లడించారు. స్వచ్ఛ్ బయో సంస్థ ఇటీవల ఏర్పడి ఉండవచ్చు కానీ అది సుగనిత్ రెన్యూవబుల్స్తో అధికారిక భాగస్వామ్యంలోకి ప్రవేశించిందని తెలిపారు. 9 రోజుల తమ పర్యటన విజయవంతమైందని, 25కంపెనీలతో రూ. 36వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని చెప్పారు.
జలమండలి ఈడీపై బదిలీ వేటు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సత్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శనివారం పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 8 ఏండ్లుగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న సత్యనారాయణ పదవీకాలం జూలై 31తో ముగిసింది. ఆయన సేవలను కొనసాగించాలని నిర్ణయించి ప్రభుత్వం మరో ఏడాదిపాటు పదవీకాలాన్ని పొడిగించింది. ఇటీవల సుంకిశాలలో జరిగిన ప్రమాద ఘటనలో బాధ్యులైన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీవేటు పడింది. సుంకిశాల ఘటనలో సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఎంఆర్డీసీఎల్కు బదిలీ చేసింది.