DSC | హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ షెడ్యూల్ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా
రీషెడ్యూల్ చేసింది.
జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపింది. పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్ను వెబ్సైట్లో పొందుపరించింది. రోజుకు రెండు సెషన్లలో సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. 18న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్తో మొదలు కానున్న పరీక్షలు ఆగస్టు 5న నిర్వహించనున్న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్, హిందీ పండిట్ పరీక్షలతో ముగియనున్నాయి. మొత్తంగా 26 రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు విద్యాశాఖ షెడ్యూల్ను వెల్లడించింది.
జూలై 18,20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు ఉంటాయి. జూలై 18, 26న పీఈటీ, జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో లాంగ్వేజ్ పండిట్, ఆగస్టు 5 పీడీ, జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1 తేదీల్లో ఎస్జీటీ, జూలై 20న స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ, ఎస్ఏ) పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.