అమరావతి : తెలంగాణ బీసీ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. రంగనాయకుల మండపం వద్ద తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు.
అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు (Telangana Devotees) ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్(Pawan kalyan) కు ప్రభుత్వం తరుఫున కొండగట్టు లో స్వాగతం పలికామని వెల్లడించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు కలిసి రావాలని కోరారు.
కాగా ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి( AP Minister Parthasarathi) కూడా ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఒంటెద్దు పోకడలతో ఏపీ సర్వనాశనం అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని రాష్ట్ర ప్రజలకు, రైతులకు , యువకులకు అందరికీ మేలు చేయాలని కోరినట్లు తెలిపారు. అనుభవశాలి చంద్రబాబు, మంత్రులందరం కలిసి వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామికంగా, అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు.