CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం గురువారం డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. ప్రధానితో పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం సమర్పించారు.
గనులు,ఖనిజాభివృద్ధి నియం త్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించాలని సీఎం కోరారు. అదే సెక్షన్ ప్రకారం కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని విజ్ఞపి చేశారు. హైదరాబాద్కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలని కోరారు.
హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. హెచ్సీయూలో భూమి అందుబాటు లో ఉన్నదని, ప్రత్యామ్నాయంగా భూ కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవరాయిలింగ్ వర్క్షాప్ కాకుండా, హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీయే మంజూరు చేయాలని విన్నవించారు.బయ్యారంలో స్టీల్ప్లాంట్ను మం జూరు చేయాలని, ఇండియా సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చాలని కోరారు.
పీఎంఏవై కింద తెలంగాణకు 25 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్జీఎఫ్ కింద రూ.1,800 కోట్లు బకాయిలు విడుదల చేయాలని, హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్పూర్ రహదారి పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములను బదిలీ చేయాలని కోరారు.
ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్లు తొందరగా చేపట్టాలని కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ, 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయండి’ అని ప్రధానిని సీఎం రేవంత్రెడ్డి కోరారు.
29 ఐపీఎస్ పోస్టులివ్వాలి
తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని,అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని హోం మంత్రి అమిత్షాను సీఎం రేవంత్ కోరా రు. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్పై 2016 లో సమీక్ష జరిగిందని, మరోసారి చేయాలని విన్నవించారు. రాష్ట్రస్థాయి అత్యున్న త నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నారొటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు 178 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపు లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండ లం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి విస్తరణకు ప్రయత్నిస్తున్నదని అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేండ్ల నుంచి పెండింగ్లో ఉందని, రూ.18.31 కోట్లు విడుదల చేయాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులు అందుబాటులో లేరని, 1065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని కోరారు.