హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) కొలువులు ఉన్నాయి.
కరీంనగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో కొత్తగా మరో 3,035 ఉద్యోగాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. జాబ్ క్యాలెండర్ విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తున్నదని, బ్రోకర్లను విశ్వసించొద్దని, నేరుగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
మంగళవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలుకు నిర్ణయించామని, డ్రైవర్లు, శ్రామిక్, కండక్టర్లు అన్ని కలిపి 3,035 ఉద్యోగులను నియమించబోతున్నామని చెప్పారు. 2014 తర్వాత ఆర్టీసీలో మొట్టమొదటి రిక్రూట్మెంట్ అని, చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలతో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
ఇటీవల వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, డిమాండ్కు అనుగుణంగా కొత్తగా 2 వేల నుంచి 2,500 బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న రాయితీ చెల్లించడంతో ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడిందని పేర్కొన్నారు. గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సి ఉందని, దీనికోసం ప్రభుత్వం, ఆర్టీసీ శ్రమిస్తున్నదని చెప్పారు. 2013లో ఉన్న పెండింగ్ ఏరియర్స్ రూ.280 కోట్ల నుంచి రూ.80 కోట్లు చెల్లించామని, మిగతా రూ.200 కోట్ల చెల్లింపులో ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నదని వివరించారు.