CM Revant Reddy | ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే హైదరాబాద్లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో సరిపడా భూమి అందుబాటులో ఉందని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో కాకుండా మరెక్కడైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నా ప్రత్యామ్నాయంగా భూకేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.
రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బదులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం సరికాదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబర్చుతున్నట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (పీఎంఏవై) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇండ్లు మంజూరయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇండ్లు మంజూరయ్యాయని వివరించారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.