Telangana Cabinet | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పీసీసీకి కొత్త అధినేత నియామకం, మంత్రివర్గ విస్తరణ జూలై మొదటి వారంలోనే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు అంశాలపై పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇతర ముఖ్యనేతలతో అధిష్ఠానం ఇప్పటికే చర్చించి నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో జూలై మొదటి వారంలోనే పీసీసీ కొత్త అధ్యక్షుడితోపాటు మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జూలై 2 లేక 4వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నదని ఈ వర్గాలు కచ్చితంగా చెప్తున్నాయి. ఈ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుని ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. జూలై 2వ తేదీ ఏకాదశి మంచి ముహూర్తమే అయినప్పటికీ ఆ రోజు మంగళవారం కావడంతో దీని కంటే 4వ తేదీన త్రయోదశి, గురువారం ఇంకా బాగుంటుందనే అభిప్రాయం వ్యకమైనట్టు సమాచారం. జూలై 6 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో ఆ లోగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.