హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లో ఒకపక్క చలి వణికిస్తున్నది. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల(Surface periodicity) కారణంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈనెల 23 నుంచి 26 వరకు హైద రాబాద్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని చెప్పారు.