హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఒక జస్టిస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ‘మీరు అర్హత కోల్పోయారు. నిష్పాక్షికత కనిపించడం లేదు. మీ ముందు ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని ఒక జస్టిస్ను ఉద్దేశించి లేఖ రాయడం క్షమార్హం కాదని పేర్కొన్నారు. పదేండ్లు సీఎంగా ఉన్న వ్యక్తి.. ‘మీరు విచారణ నుంచి తప్పుకోవాలి’ అని జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై వివరణకు కమిషన్ ఇచ్చిన గడువు లోపు వివరణ ఇవ్వకుండా ప్రత్యారోపణలు చేస్తూ, ప్రతిదాడి చేస్తూ లేఖ రాయడం చట్ట విరుద్ధమన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ 25 మందిని వివరణ కోరితే కేసీఆర్ ఒక్కరే ఇలా స్పందించడం సరికాదని పేర్కొన్నారు.