TGPSC | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తుండగా, శుక్రవారం ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు.
నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమాలలో పాల్గొనడానికి నిరుద్యోగులు స్వచ్చందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పైడిమాండ్లతోపాటు డిసెంబర్లో గ్రూపు 2,3 పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగ భృతి కింద రూ.4 వేలు ఇవ్వాలని, గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానం అమలుచేయాని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికల్లో వేలాది పోస్టులు దర్శనమిస్తున్నాయి.
నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి, ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి.
ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరుద్యోగుల నిరసనలు, శాంతియుత ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ప్రజా గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ నినాదాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బహిష్కృ త నేత బక్క జడ్సన్, ఫ్యాకల్టీ అశోక్ తమ ఇండ్లలోనే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను గురువారం నుంచే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముట్టడిని అడ్డుకోవాలని చూస్తున్నారు. వివిధ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహడ్లో సేవాలాల్ సేన రాష్ట్ర కోకన్వీనర్ బాణావత్ హుస్సేన్నాయక్ను పోలీసు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలోనే ఈ అరెస్టు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ అశోక్నగర్లో, ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్టు తెలుస్తున్నది.
వినాయక్నగర్, జూలై 4/కరీంనగర్ తెలంగాణచౌక్/అచ్చంపేట రూరల్/బూర్గంపాడు/వనపర్తి/కాశీబుగ్గ: హైదరాబాద్లో శుక్రవారం నిర్వ హించే నిరుద్యోగ మార్చ్ను విఫలం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నట్టు సమాచారం. నిరుద్యోగ యువతను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. వారిండ్లపై పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు అందుబాటులో లేకుండా ఆంక్షలు విధిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డిని గురువారం రాత్రి కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి మహేందర్, కార్యదర్శి యుగేందర్నూ అదుపులోకి తీసుకోని వన్టౌన్ స్టేషన్కు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ చౌరస్తాలో సిద్దాపూర్ పోలీసులు అరెస్టు చేసి అచ్చంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవాలాల్సేన రాష్ట్ర కో కన్వీనర్ హుస్సేన్నాయక్ సహా మరో 20 మందిని ముందస్తు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కేతేపల్లికి చెందిన అర్జున్, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన నగేశ్ను వనపర్తి పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఇంతేజార్గంజ్ పోలీసులు గురువారం రాత్రి పలువురు బీజేవైఎం నేతలను
అరెస్టు చేశారు.