హైదరాబాద్: గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగలు మార్చ్ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. జిల్లాల నుంచి యువతను రాజధానికి రాకుండా అక్రమఅరెస్టులు చేస్తున్నది. హైదరాబాద్ చుట్టూ పికెటింగ్లు ఏర్పాటుచేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అమ్రబాద్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సుల్తాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహడ్లో సేవాలాల్ సేన రాష్ట్ర కోకన్వీనర్ బాణావత్ హుస్సేన్నాయక్ను పోలీసు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ అశోక్నగర్లో, ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్టు తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డిని గురువారం రాత్రి కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి మహేందర్, కార్యదర్శి యుగేందర్నూ అదుపులోకి తీసుకోని వన్టౌన్ స్టేషన్కు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ చౌరస్తాలో సిద్దాపూర్ పోలీసులు అరెస్టు చేసి అచ్చంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవాలాల్సేన రాష్ట్ర కో కన్వీనర్ హుస్సేన్నాయక్ సహా మరో 20 మందిని ముందస్తు అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కేతేపల్లికి చెందిన అర్జున్, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన నగేశ్ను వనపర్తి పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఇంతేజార్గంజ్ పోలీసులు గురువారం రాత్రి పలువురు బీజేవైఎం నేతలను అరెస్టు చేశారు.
కొనసాగుతున్న ఆమరణ దీక్షలు, నిరసనలు
ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరుద్యోగుల నిరసనలు, శాంతియుత ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ప్రజా గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ నినాదాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బహిష్కృ త నేత బక్క జడ్సన్, ఫ్యాకల్టీ అశోక్ తమ ఇండ్లలోనే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.