Telangana | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంద్కు పిలుపుఇవ్వబోతున్నట్టు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా బంద్ చేపడుతామని, అందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యాగాలు ఇస్తామని, జాబ్ క్యాలండర్ ప్రకటించి అందరికీ న్యాయం చేస్తామని మాట ఇచ్చి, పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు తెలిసిపోయాయని నిరుద్యోగులు మండిపడ్డారు.
ఉద్యోగాల సాధన కోసం గాంధీ దవాఖానలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ను శుక్రవారం విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ పరామర్శించారు. దీక్ష చేస్తున్న మోతిలాల్కు, నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మోతిలాల్ దీక్షకు రోజురోజుకు అన్ని వర్గాల వారి నుంచి మద్దతు పెరుగుతుంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగుల వ్యతిరేకిగా మారారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ దీక్షతోఆరోగ్యం క్షీణిస్తున్నదని, వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలని, టీచర్ పోస్టులను కూడా 25వేలకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిని సెక్రటేరియట్లో శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను లెకిస్తే గ్రూప్-1 సర్వీస్ 1600, గ్రూప్-2 సర్వీస్ 2200, గ్రూప్3 పోస్టులు 8500 ఉంటాయని, ప్రస్తుత నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచి, భర్తీ చేయాలని కోరారు.
పీఆర్సీ రిపోర్టు ప్రకారం 25 వేల టీచర్ పోస్టులున్నా, కేవలం 11వేలను భర్తీ చేస్తున్నట్టు వాపోయారు. వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలు చేయాలని, దీంతో పోస్టులు మిగిలిపోకుండా భర్తీ అవుతాయని వెల్లడించారు. ఇప్పటికే అన్నిశాఖల్లో అడ్హక్ ప్రమోషన్లతో భర్తీ చేశారని, కొందరు ఉన్నతాధికారులు డైరెక్టు రిక్రూట్మెంట్ లెకించడంలో అన్యాయం చేస్తున్నారని వివరించారు. ఆయా అంశాలను సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. కృష్ణయ్య వెంట గుజ్జ కృష్ణ, గోరేగే మల్లేశ్యాదవ్, వేముల రామకృష్ణ, మోదీరాందేవ్ తదితరులున్నారు.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. గత పదేండ్లుగా బదిలీలు లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ప్రతి ఐదేండ్లకొకసారి బదిలీలు జరగాల్సి ఉండగా, కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగులను జిల్లాల వారీగా విభజించడం, ఎన్నికల కోడ్, కరోనా మహమ్మారి తదితర కారణాలతో ఇన్నాళ్లు బదిలీలు జరగలేదు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో వెంటనే బదిలీలు చేపట్టాలని సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాష్ట్రంలో 4 వేల మంది ఉద్యోగులు సెర్ప్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో కమ్యూనిటి కోఆర్డినేటర్లు(సీసీ), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపీఎం) ఉన్నారు. వీరితో పాటు డీపీఎంలు, ఆడ్మిన్ అసిస్టెంట్లు, ఎంబీకేలు, మండల సమాఖ్య కోఆర్డినేటర్లు, మినిస్టిరియల్ సిబ్బంది ఉన్నారు. వీరంతా బదిలీలు ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అత్యధిక సంఖ్యలో ఉండే సీసీలు తమ సొంత మండలాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరు అవినీతి, అధికార దుర్వినియోగం, వివక్ష చూపుతున్నారంటూ స్థానికంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సొంత మండలాల నుంచి వారిని బదిలీ చేయాలనే డిమాండ్ ఉన్నది. వీరితో పాటుగా ఏపీఎంలు సుదీర్ఘ కాలం ఒకే దగ్గర పనిచేస్తున్నారు. వీరికి గత కొన్నేండ్లుగా బదిలీలు జరగలేదు. వెంటనే బదిలీలపై నిషేధం ఎత్తివేసి, కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతుల్లోనూ రీలింక్విష్మెంట్ను పాటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదోన్నతుల్లో ఒకే టీచర్కు రెండు, మూడు దక్కాయి. కానీ ఆఖరుకు ఒక టీచర్ ఒకే పదోన్నతిని ఎంపిక చేసుకొని విధుల్లో చేరారు. దీంతో వారు పొందిన మిగతా పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అయ్యాయి. ఇలాంటివి రాష్ట్రంలో 600 వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఆయా పోస్టులను సీనియార్టీ జాబితాలో ఉన్న వారితో భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
ఈ నేపథ్యంలో రీలింక్విష్మెంట్ను అమలు చేయాలని నిర్ణయించారు. తాజా షెడ్యూల్లోనే ఇతరులతో నింపుతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. నిలిచిపోయిన రంగారెడ్డి జిల్లా టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఇదే షెడ్యూల్లో పూర్తిచేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఆయా సబ్జెక్టుల్లో 40 పోస్టులను ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. సోమవారం నుంచి వారం రోజుల్లో బదిలీలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే హెచ్ఎం పదోన్నతులు పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత మరో రెండు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. ఆ తర్వాత మూడు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్రప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 2024 సంవత్సరానికిగానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర పాఠశాల విద్యామంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. దరఖాస్తులను http//nationalawardsto teachers.education.gov.in ద్వారా వచ్చే నెల 15లోగా పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
బొమ్మలరామారం/ మద్దిరాల, జూన్ 28 : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోమాజిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 12 సంవత్సరాలుగా ఎస్జీటీగా పనిచేస్తున్న కోట ప్రదీప్కన్నా ఇటీవల ప్రమోషన్పై రాజాపేట మండలం బేగంపేట జడ్పీహెచ్ఎస్కు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా బదిలీ అయ్యారు. శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించగా.. తమ పాఠశాల విడిచి వెళ్లొద్దని ఉపాధ్యాయుడిని విద్యార్థులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాషా పండితుడిగా పనిచేస్తున్న మెంతబోయిన సైదులు బదిలీపై స్కూల్ నుంచి వెళ్తుండగా.. వెళ్లిపోవద్దు సార్ అంటూ విద్యార్థులు ఉపాధ్యాయుడి కాళ్ల మీద పడి వేడుకున్నారు.