ఖమ్మం, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరద ముంపునకు ఏ మాత్రం సంబంధం లేని ఆ గ్రామాలను తిరిగి భద్రాచలం మండలంలో కలపాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
శనివారం ఆయన ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పాలనాపరమైన అంశాలపై ఎప్పుడు చర్చ జరిగినా విలీన గ్రామాలను తిరిగి ఇచ్చే విషయాన్ని ప్రధాన అంశంగా చర్చిస్తామని చెప్పారు. ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడం వల్ల.. దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాచలం పట్టణానికి డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, చెత్త ఎక్కడ పోయాలో కూడా తెలియని దుస్థితి తలెత్తిందని అన్నారు.