Congress | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం. తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు నియామకాలపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డిని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ ఆదేశించినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని పునస్సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది.
ఒకే దఫాలో 37 మందికి పోస్టులు
లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఒకే దఫాలో 37 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టు మార్చి 15న పీసీసీ అనధికారికంగా ప్రకటించింది. ఆ జాబితాలో ఉన్న నేతలు కొందరు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డిని కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ ముగిసిన తర్వాత వీటికి సంబంధించిన జీవోలు జారీ అవుతాయని రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారు. తమతో చర్చించకుండానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు కొందరు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పుచేర్పులు ఉంటాయని అధిష్ఠానం అప్పుడు వారికి హామీ ఇచ్చింది.
గుర్రుగా మంత్రులు
తనతో చర్చించకుండానే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నరేందర్రెడ్డిని నియమించారని కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇనుగాల వెంకట్రామిరెడ్డిని నియమించడంపై మంత్రి కొండా సురేఖ కూడా సీఎం రేవంత్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి విజయానికి కృషి చేసిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తామనడంపై జగదీశ్వర్రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు ప్రాధాన్యంలేని అయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్ పదవి వద్దని వరంగల్ జిల్లాకు చెందిన జంగా రాఘవరెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కూడా తనకు ఇవ్వనున్నట్టు ప్రకటించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
తిరగబడిన వ్యూహం
ఎన్నికలకు ముందు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని రేవంత్రెడ్డి భావించారని ఆయన సన్నిహితులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ వ్యూహం ఫలించలేదు. ఎలాగూ పోస్టులు దక్కడంతో కొందరు నేతలు మొక్కుబడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఈ కారణంగా కచ్చితంగా గెలిచే సీట్లను కూడా కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని చెప్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డిని అనర్హులకు నామినేటెడ్ పోస్టుల ఫిర్యాదుపై అధిష్ఠానం ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులతో పాటు ప్రకటించాల్సిన వాటిపై మళ్లీ కసరత్తు చేసి తమ ఆమోదానికి పంపించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండుమూడ్రోజులుగా రేవంత్రెడ్డి, దీపాదాస్ మున్షీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.