Telangana | ఖైరతాబాద్, జూన్ 26: నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీచేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్రెడ్డి అర్హుడు కాదని, అర్హత లేని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారు.
రేవంత్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నవాళ్లంతా సమైక్యవాదులేనని, వాళ్లిక తెలంగాణ రాష్ర్టానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన నిలబడుతామని ప్రకటించి కాంగ్రెస్కు డబ్బా కొట్టినవాళ్లంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.
సమావేశానికి హాజరైన వక్తలంతా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటలు నీటిమూటలయ్యాయని, సీఎం రేవంత్కు పట్టింపులేదని, అందుకే రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జంగ్సైరన్ పూరిస్తున్నామని, ప్రతి ఒక్క నిరుద్యోగి సామాజిక మాధ్యమాల వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు, రాహుల్, ప్రియాంక, రేవంత్ అబద్ధాలను జోడిస్తూ ‘థూ..థూ..’ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సెగ కాంగ్రెస్కు, ఆ పార్టీ అధిష్ఠానానికి గట్టిగా తాకాలన్నారు.
మోసంచేసి కాంగ్రెస్ గెలిచింది
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులను మభ్యపెట్టారని, ధర్నాచౌక్లు, హాస్టళ్లు, ఇనిస్టిట్యూట్లకు వచ్చి ప్రగల్భాలు పలికారని, చివరికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పిలిపించి మరీ అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గెలవలేదని, నిరుద్యోగులను నమ్మించి వాడుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మొదటి క్యాబినెట్ సమావేశాల్లోనే డీఎస్సీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై తీర్మానం చేస్తారని భావించామని, కాని మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క అంశంపైనా చర్చ జరగలేదని, నాడే ఇది మొదటి మోసమని గుర్తించామని చెప్పారు. నిరుద్యోగులు కాళ్లావేళ్లా పడాల్సిన పనిలేదని, కాళ్లు పట్టి లాగాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క గ్రూప్-1 ప్రిలిమినరీ పోస్టులు 1:100 నిష్పత్తితో ఇవ్వాలని డిమాండ్ చేశారని, కానీ గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామన్నారని, ఆర్నెళ్లు దాటినా రూపాయి కూడా ఇవ్వలేదని, ఈ లెక్కన రూ.24వేల చొప్పున ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డారని చెప్పారు.
అసలు ఉద్యోగాలివ్వాలన్న ఆలోచనే కాంగ్రెస్ సర్కారుకు లేదని, గ్యాప్లు లేకుండా పరీక్షలు పెట్టడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఇప్పటికే ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. ఆమె చావుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. నిరుద్యోగులకు మద్దతుగా గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్నాయక్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ప్రియాంకకు ప్రసంగాలను ట్వీట్ చేయండి
తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ మాట్లాడుతూ ఏఐసీసీ నేత ప్రియాంకగాంధీ 2023, మే 8న సరూర్నగర్ స్టేడియంలో ‘యూత్ డిక్లరేషన్ ఫర్ తెలంగాణ’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే 30వేల మంది నిరుద్యోగులు వెళ్లారని, అమరవీరులు, ఉద్యమకారులకు గుర్తింపునిస్తామన్నారని, ఆర్నేళ్లలో వారికి కనీసం అమరవీరుల అడ్రస్ కూడా దొరకలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రియాంక చేసిన ప్రసంగ వీడియోలను ఎక్స్వేదికగా రాష్ట్రంలోని 30లక్షల నిరుద్యోగులు ఆమెకు ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు.
సీఎంకు బాలకృష్ణను కలిసేందుకు, క్రికెట్ చూ సేందుకు, ఫుట్బాల్ ఆడేందుకు సమయం ఉందని, చివరికి లండన్ వెళ్లి థేమ్స్ నదిని పరీక్షించి, వారం పాటు దావోస్లో ఉండి మూసినది ప్రక్షాళనకు రూ.50వేల కోట్లు ఖర్చు పెడుతామని ప్రకటించారని, కానీ నిరుద్యోగులను కలిసేందుకు మాత్రం ఆయనకు సమయం లేదని దుయ్యబట్టారు. ఇది దగాకోరు, మోసపూరిత పాలన కాదా అని ప్రశ్నించారు.
తొలిఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి విస్మరించారని, జూన్ 2 నాటికి అన్ని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 15లోపు నియామకాలు పూర్తిచేస్తామన్నారని, కానీ ఇప్పటికీ ఆ ఊసే లేదని ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడిపోతే ఎంత? అని విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన నిలబడుతామని ప్రకటించి కాంగ్రెస్కు డబ్బా కొట్టిన కోదండరాం, రియాజ్, బ ల్మూరి వెంకట్, ఆకునూరి మురళీ, చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
ఇక నిరుద్యోగులు సైలెంట్గా ఉంటే కాదని, కొత్తపంథాలో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నిరుద్యోగి సామాజిక మాధ్యమాల వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు, రాహుల్, ప్రియాం క అబద్ధాలను జోడిస్తూ థూ..థూ.. ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, ప్రొఫెసర్ మురళీ మనోహర్రావు, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, సాంబశివగౌడ్, శివానందస్వామి, మిత్ర తదితరులు పాల్గొన్నారు.