హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని విమర్శించారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలుకొట్టామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు హైదరాబాద్ నగరమంతా కంచెలు పాతుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావానికి లోనవుతున్నదని చెప్పారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నారని విమర్శించారు. అధికారం చేతికి చిక్కాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా ఒక్క పోస్టూ పెంచలేదన్నారు. గతంలో ఇదే నోటిఫికేషన్ను కుట్రపూరితంగా అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలన్నారు.