TGBKS | నమస్తే నెట్వర్క్, జూలై 1: బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందించారు. రామగుండం ఒకటో డివిజన్లో ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ , ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2లో టీబీజీకేఎస్ నాయకులు ఉప్పుల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి , బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్, శాంతిఖని గని ఆవరణలో నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
మందమర్రి ఏరియాలోని కాసిపేట-1వ, కాసిపేట-2 ఇైంక్లెన్ గనులపై ఏఐటీయూసీ గేట్ మీటింగ్ నిర్వహించారు. బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్ సీహెచ్పీ, బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్, స్టోర్స్, మందమర్రి ఏరియాలోని కేకే-5గని, ఏరియా వర్క్షాప్, బెల్లంపల్లి ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్పీ, ఏరియా వర్క్షాప్, భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులపై టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి మేనేజర్లకు వినతిపత్రాలను అందజేశారు.
శ్రావణపల్లి ఓసీపీ గనితోపాటు కల్యాణిఖని 6 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేలా చూడాలని, బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సదానందం, భూపాలపల్లి డివిజన్ ఉపాధ్యక్షుడు సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.