Singareni | ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎం ఎన్ బలరామ్ అన్నారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా రోజుకు 2లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తూ రవాణా చేయాలని.. రోజుకు 13లక్షల క్యూబిక్ మీటర్ల బర్డెన్ను తొలగించాలని జీఎంలను ఆదేశించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆయన సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో ఉత్పత్తి, నూతన ప్రాజెక్టులు, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, ఇతర కంటిన్యూయస్ మైన్స్ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఉత్పత్తికి నష్టం వాటిల్లకుండా హాల్ రోడ్లను ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకోవాలని.. క్వారీల్లో నిలిచిన వర్షం నీటిని పంపింగ్ చేయాలని, ఏదైనా షిఫ్ట్లో వర్షంతో ఉత్పత్తికి నష్టం కలిగితే మరుసటి షిఫ్ట్లో భర్తీ చేయాలని సూచించారు.
ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని ఏరియాలకు అవసరమైన యంత్రాలను, ఓవర్ బర్డెన్ తొలగించడానికి ఏజెన్సీల నియామకం పూర్తి చేశామని, ఏరియా యాజమాన్యాలు మరింత శ్రద్ధ వహిస్తూ లక్ష్యాలు సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. ఇందులో మరో 5 ఏళ్లలో మొత్తం 10 గనులు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి సన్నాహాలు ముమ్మరం చేయాలన్నారు. ఈ ఏడాది మరో మూడు నెలల్లో ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గనులకు సంబంధించిన మిగిలిన అనుమతులు, ఏర్పాట్లను సమయానుకూలంగా పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులందరూ తమకు కేటాయించిన 8 గంటల పూర్తి సమయం పనిచేసే విధంగా వారిని చైతన్యం చేయాలని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల డైరెక్టర్లు డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డి, దేవేందర్, సీపీపీ జీఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.