గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ప్రదానం
హైదరాబాద్,జూన్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్కు ‘ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డు లభించింది. సింగరేణిని పర్యావరణ అనుకూల సంస్థగా మార్చడంతోపాటు స్వయంగా 18 వేలకుపైగా మొక్కలను నాటి ప్రజల్లో పర్యావరణ స్ఫూర్తిని పెంచినందుకు, తెలంగాణలోని 6 జిల్లాల్లో 35 చిన్న అడవులను (మినీఫారెస్ట్స్) సృష్టించినందుకు ఈ అవార్డు వరించింది.
శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. వక్తలు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు బలరామ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు సింగరేణి పలు కార్యక్రమాలను చేపడుతున్నదని, సింగరేణి బడుల్లో పిల్లలకు పర్యావరణ సిలబస్ను బోధిస్తున్నామని బలరామ్ వివరించారు.
ఈ నేపథ్యంలో సీఎంపీడీఐ 2021-22లో తమ సంస్థను ‘కార్బన్ న్యూట్రాలిటీ కంపెనీ’గా గుర్తించిందని తెలిపారు. ఈ ఏడాది 40 లక్షల మొక్కలను నా టేందుకు సింగరేణి సిద్ధమైందని, వనమహోత్సవంలో భాగంగా 2 వేల మొక్కలను నాటాలని వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు. గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా తదితర కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.