హైదరాబాద్ : వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు(Seeds) వేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ, ఖమ్మం జిల్లాలో (Khammam) విత్తనాలు అందుబాటులో (Seeds shortage) లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది వానకాలం సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది.
కాగా, ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికి క్షేత్రస్థాయిలో మాత్రం సకాలంలో విత్తనాలు లభించని పరిస్థితి నెలకొన్నది. ప్రణాళిక మేరకు విత్తనాలు సరఫరా చేయకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విత్తనాల సరఫరాలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందేవని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా విత్తనాలు అదుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.