హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కొందరు నాయకులు బీఆర్ఎస్ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, పార్టీకి తిరిగి మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వారితో చర్చించారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. పార్టీ తొలినాళ్ల నుంచి అనేకమంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురిచేసినా బీఆర్ఎస్ ముందుకు సాగిన తీరును వివరించినట్టు సమాచారం. 2004 అనంతరం రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ఉదహరించినట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పనిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చినట్టు సమాచారం. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తుచేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి దా దాపు ఏడు నెలలు కావస్తున్నా ఒక్క మంచి పనినైనా చేసిందా? అని వ్యాఖ్యానించారు. రైతులు, చేనేత కార్మికులు, యువకులు, మహిళలకు ఉపయోగపడే పనులేమైనా జరిగాయా? కనీసం పింఛన్లు అయినా ఇస్తున్నరా? అని ఆయన ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదని ఒకరిద్దరు నేతలు ప్రస్తావించగా.. ‘చేతగాని సర్కారుకు చేతులెక్కువ’ అన్నట్టే తయారైంది పరిస్థితి అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ఆ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలోనే పెల్లుబుకుతున్న అసంతృప్తిని ఈ సందర్భంగా నాయకులు కేసీఆర్కు వివరించినట్టు సమాచారం. పాలనపై దృష్టిపెట్టకుండా సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయలోపం వంటి విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. రోజురోజుకు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, నేతన్నల ఆత్మహత్యల ఘటనలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. హామీల అమలులో రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని, సీఎం అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ రోజురోజుకు పట్టు ను సాధించలేకపోతున్నారని నేతలు వివరించినట్టు తెలిసింది. కేసీఆర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాష్గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నేత క్యామ మల్లేశ్ ఉన్నారు.