KTR | చట్టాన్ని గౌరవిస్తూ తాము మహిళా కమిషన్ ముందుకు వస్తే, తమ నాయకురాళ్లపై మహిళా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమపై జరిగిన దాడి మీద కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్లోని బుద్ధభవన్లో మహిళా కమిషన్ కార్యాలయానికి శనివారం వచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మహిళ కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని కేటీఆర్ తెలిపారు. తాను యథాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని కమిషన్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని చెప్పారు. చట్టాన్ని గౌరవిస్తూ తాము కమిషన్ ముందుకు వస్తే మహిళా కాంగ్రెస్ నేతలు మా మహిళా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నెయిల్ కట్టర్ చాకులతో గాయపరిచారని, వారిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో తాము వస్తే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి దాడి చేయటం సరికాదని కేటీఆర్ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్య తీసుకోవాలని.. కమిషన్ సుమోటోగా తీసుకోవాలని కోరారు. ఎనిమిది నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను వారికి ఇచ్చే ప్రయత్నం చేశానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న పరిస్థితులు, దాడుల విషయంలో కమిషన్ చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. రాష్ట్రంలో కొరవడిన మహిళా భద్రత, విద్యార్థుల పట్ల లైంగిక దాడులు వంటి అంశాలను ప్రస్తావించేందుకు అన్ని వివరాలతో తాను వెళ్లానని తెలిపారు. మరోసారి రావాలని కమిషన్ చెప్పిందన్నారు. తప్పకుండా వారు కోరినట్టుగా మళ్లీ సమయం తీసుకొని వస్తామని తెలిపారు. తాను ఇచ్చిన వివరణపై కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని.. తప్పు చేస్తే క్షమాపణ అడగాలని అన్నారు. తాను అందుకే ఒక్క మాట దొర్లితే మహిళలను గౌరవించే వ్యక్తిగా క్షమాపణ అడిగానని పేర్కొన్నారు.