హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 317 జీవో ప్రకారం డిస్ట్రిక్, జోనల్, మల్టీజోనల్ వారీగా టీచర్లకు సంబంధించిన ఒకే సీనియార్టీ లిస్టును ప్రకటిస్తామని ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు. ఈ జాబితా ప్రకారం స్థానికేతర ఉపాధ్యాయులను కౌన్సెలింగ్కు పిలిచి బదిలీ చేస్తామని వెల్లడించారు. 317 జీవో అమలులో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఎస్సీ గురుకుల సంస్థలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సెక్రటరీ శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సీనియార్టీ జాబితా, బదిలీ తదితర అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఫైనల్ వేకెన్సీ లిస్ట్ను ప్రకటిస్తామని తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ప్రత్యక్ష పద్ధతి ద్వారా బదిలీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. స్పౌజ్, మెడికల్, వ్యక్తిగత కారణాలన్నింటినీ కౌన్సెలింగ్లో పరిగణనలోకి తీసుకుని తగు న్యాయం చేస్తామని కార్యదర్శి వర్షిణి హామీ ఇచ్చారు.
కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి గ్రీవెన్స్ ఆధారంగా బదిలీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వర్షిణి, ఇతర అధికారులకు గురుకుల ఉద్యోగులందరి తరపున టిగారియ (తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్) అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేశ్, భిక్షంయాదవ్, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.