హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్గా సౌరభ్ బందోపాధ్యాయ (ఐఆర్ఎస్ఎస్ఈ) మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీర్స్ -1990 బ్యాచ్కి చెందిన వారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో ఎంబీసీ కులాలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ఆధునిక ధోబీఘాట్లు, కమ్యూనిటీల అభివృద్ధికి మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.54 కోట్ల వాహనాలున్నాయి. వీటిలో 1.13 కోట్లు ద్విచక్ర వాహనాలు కాగా, 41 లక్షలు ఇతర వాహనాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో కార్లే దాదాపు 15 లక్షలు ఉంటాయి. ఈ లెక్కన ప్రతి కిలోమీటరుకు సుమారు 10వేల వాహనాలున్నట్టు తెలుస్తున్నది.