హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, ఆ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ లక్ష్మీనరసింహారెడ్డి, సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షులు మధుసూదన్రెడ్డి, నెమలి సుభాశ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు స్పందించడం లేదని శనివారం హైదరాబాద్లో గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వినతిప్రతం అందజేశారు.
అనంతరం రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 2019-24 లో సర్పంచ్లుగా ఉండి గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, మనఊరు-మనబడి, పల్లెప్రగతి, మిషన్ భగీరథ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తెలంగాణ పంచాయతీలను దేశానికే ఆదర్శంగా తీర్చిద్దామని గుర్తుచేశారు.
తమ పదవీకాలం ముగిసి ఐదు నెలలు కావస్తున్నా పెండింగ్ బిల్లులు అందక 12,769 పంచాయతీల తాజా మాజీ సర్పంచ్లు తీవ్ర ఆర్థికఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పా రు. బిల్లులు అందక, అప్పులు చెల్లించలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులపై సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందన రాకపోవడంతో గవర్నర్కు వినతిప్రతం ఇచ్చామ ని తెలిపారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని గవర్నర్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలైనా బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. పెండింగ్ బిల్లులు తక్షణమే ప్రభుత్వం ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘాల నేతలు సముద్రాల రమేశ్, ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, రాజేందర్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
30 లక్షల బకాయి
మా పంచాయతీకే 30 లక్షల బిల్లులు రావాలి. అప్పులు తెచ్చి అభివృద్ధి చేసి నం. మా పంచాయతీకి కేంద్ర అవార్డు వచ్చింది. మా పదవీకాలం ముగిసినా బిల్లులు రావడంలేదు.
-లక్ష్మీప్రసాద్రెడ్డి, కొలనుపాక మాజీ సర్పంచ్, భువనగిరి జిల్లా
నెల ఖర్చు 11 లక్షలు
మాది మేజర్ పంచాయతీ. నిర్వహణ కు నెలకు 11 లక్షలు ఖర్చవుతుంది. తొలుత చెక్ పవర్ లేనప్పుడు పంచాయతీ సిబ్బంది వేతనాలను కూడా జేబుల్లోంచి ఇచ్చినం. కొత్త ప్రభుత్వం వచ్చాక బకాయిలు ఇస్తలేదు. నిధులు రాక ప్రత్యేకాధికారులు బల్బు కూడా వేయలేకపోతున్నరు.
-రాజేందర్, ముథోల్ మాజీ సర్పంచ్, నిర్మల్ జిల్లా
బిల్లులు ఇచ్చే ఎన్నికలకు..
మా బాధలను రేవంత్రెడ్డి ప్రభుత్వం అర్థంచేసుకోవాలి. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. లేదంటే కొత్త సర్పంచ్లతో మాకు ఇబ్బందులు వస్తయ్. బకాయిలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఆందోళన చేస్తం.
-నెమలి సుభాశ్, ఇబ్రహీంనగర్ మాజీ సర్పంచ్, సిద్దిపేట జిల్లా
రూపాయి ఇవ్వలే..
మా పాలనలో అప్పు చేసి అభివృద్ధి పనులు చేసినం. మా పంచాయతీకి రూ.30 లక్షల బిల్లు లు రావాలి. కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలవుతున్నా పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదు.
-సముద్రాల రమేశ్, ఖమ్మంపల్లి మాజీ సర్పంచ్, పెద్దపల్లి జిల్లా