ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి, పలుగుగడ్డ, మునిగడప, రాయవరం, ధర్మారం, అంతాయగూడెం గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. బీఆర్ఎస్ హయాంలో జీతాలు నెలనెలా వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని అన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని భిక్షాటన చేసి నిరసన తెలిపినట్టు వారు పేర్కొన్నారు.
– జగదేవ్పూర్
తమకు సరిపడా బస్సులు నడపాలని విద్యార్థులు, ప్రయాణికులు మంగళవారం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ వద్ద ఆర్టీసీ బస్సు ఎదుట నిలబడి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం అరకొర బస్సులు నడపడం వల్ల తాము పాఠశాలలు, కాలేజీలకు సరైన సమయంలో చేరుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కెపాసీటీకి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మండలంలోని పోన్కల్, పోతారం, అనంతపేట్, కమల్కోట్ గ్రామాలకు ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని డిమాండ్ చేశారు.
– నిర్మల్ అర్బన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట పోడుదారులు మంగళవారం నిరసన తెలిపారు. మద్దుకూరుకు చెందిన 20 మంది పోడుదారులు సుమారు రెండేండ్ల క్రితం 20 ఎకరాల అటవీశాఖ భూమిని సాగు కోసం పోడుకొట్టారు. ప్లాంటేషన్ మొక్కలు వేస్తామని చెప్పి అటవీ అధికారులు వారి నుంచి భూములను గంజుకున్నారు. ఈ ఏడాది అదే భూమిలో పోడు పట్టాలు కలిగిన అదే గ్రామానికి చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. దీంతో పోడుదారులు అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఉన్న బీట్ అధికారి భాస్కర్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
– చండ్రుగొండ